కోవిడ్ టీకా తీసుకున్న కమల్‌హాసన్‌

చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. చెన్నైలో ఓ హాస్పిటల్‌లో ఆయన తొలి డోసు టీకా వేయించుకున్నారు. కమల్ హాసన్ వయసు 66 ఏళ్లు. టీకా తీసుకున్న విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అవసరమైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఆయన కోరారు. శ్రీ రామచంద్ర హాస్పిటల్‌లో వ్యాక్సిన్ తీసుకున్నానని, తమ గురించి, ఇతరుల గురించి ఆలోచించేవారు టీకా వేసుకోవాలన్నారు. ఇవాళ శరీరాన్ని ఇమ్యునైజ్ చేస్తామని, వచ్చే నెలలో అవినీతికి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ చేపడుతామని, దీనికి సిద్ధంగా ఉండాలంటూ తన ట్వీట్‌లో కమల్ తెలిపారు. దేశవ్యాప్తంగా రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న ప్రధాని మోదీతో పాటు పలువురు సీఎంలు టీకాలు తీసుకున్నారు. ఇవాళ కొందరు కేంద్ర మంత్రులు టీకాలు తీసుకుంటున్నారు. 60 ఏళ్లు దాటిన వారితో సహా వ్యాధులతో ఉన్న 45 ఏళ్లు దాటిన వారికి రెండవ దశలో కోవిడ్ టీకాలు వేస్తున్నారు.