కరోనా కట్టడికి కేసీఆర్ కీలక నిర్ణయాలు

కరోనా ఉధృతిని తట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ విధించింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇచ్చి ఆ తరువాత కర్ఫ్యూ ప్రకటించింది. అయితే సీఎం కేసీఆర్ మరోవైపు కొవిడ్ బాధితులకు వైద్య సదుపాయాలు అందించేందుకు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అందరికీ అత్యవసరమైన ఆక్సిజన్ ను ఏర్పాటు చేయడంపై చర్చించారు. లాక్డౌన్ తో కొవిడ్ కేసులు తగ్గడంతో పాటు డిశ్చార్జిలు పెరగడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,86,780 వ్యాక్సిన్ డోసులు స్టాక్ ఉందని అధికారులు నివేదిక ఇచ్చారు. ఇందులో కోవాగ్జిన్ 58,230, కోవిషీల్డ్ 1,28, 550 ఉందని తెలిపారు. ఇక కొవిడ్ బాధితులకు రాష్ట్రవ్యాప్తంగా 48 ఆసుపత్రుల్లో 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి భవిష్యత్లో కొరత లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అలాగే 100 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేసే ప్లాంటును హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలన్నారు.

ప్రభుత్వం ఆసుపత్రుల్లో 6,926 బెడ్లు ఖాళీగా ఉన్నాయి, అందులో ఆక్సిజన్ బెడ్స్ 2,253, ఐసీయూ 533, జనరల్ బెడ్స్ 4,410 ఖాళీగా ఉన్నాయని సీఎం చెప్పారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో ఉన్న 200 పడకల ఆసుపత్రిని కొవిడ్ బాధితుల కోసం వినియోగించాలని చెప్పారు. అలాగే సింగరేణి, ఈఎస్ఐ, రైల్వే తదితర ఆసుపత్రులన్నీ రోగుల కోసం వినియోగించుకోవాలన్నారు.

ఇక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చుపెట్టుకోవద్దని, కొవిడ్ కు ఎక్కడైనా ఒకటే వైద్యం అని కేసీఆర్ అన్నారు. ప్రైవేట్ లో అసవసరంగా డబ్బులు వసూలు చేస్తారని, అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేరాలని సూచించారు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ల విషయంతో పాటు కొవిడ్ ధరలను నిర్ణయిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకుంది.