ముంబయిపై కోల్‌కతా టీం అద్భుత విజయం.. అర్థసెంచరీలతో ఆకట్టుకున్న అయ్యర్, త్రిపాఠి

ఐపీఎల్ 2021లో భాగంగా 34 వ మ్యాచులో ముంబై ఇండియన్స్ టీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో కేకేఆర్ టీం అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. కోల్‌కతా విజయంలో వెంకటేష్ అయ్యర్(53 పరుగులు, 30 బంతులు, 4 ఫోర్లు, 3 సిక్సులు), రాహుల్ త్రిపాఠి(74 పరుగులు, 42 బంతులు, 8 ఫోర్లు, 3 సిక్సులు) కీలక పాత్ర పోషించారు. ఇద్దరూ కలిసి 2 వ వికెట్‌కు 88 పరుగులు జోడించి, ముంబై బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని చూపించారు. వీరిద్దరూ 176 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి బౌలర్లకు చుక్కలు చూపించారు. నిర్ణీత లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలోనే సాధించింది. ముంబై బౌలర్లలో బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. దీంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 4వ స్థానానికి చేరుకుంది. ముంబయి ఇండియన్స్ 6వ స్థానానికి పడిపోయింది.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ టీం ముందు 156 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కెప్టెన్ రోహత్ శర్మ, క్వింటన్ డికాక్‌లు ఇద్దరూ కలిసి అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఆ తరువాత 9.2 ఓవర్లో రోహిత్ శర్మ (33 పరుగులు, 30 బంతులు, 4 ఫోర్లు) రూపంలో ముంబై టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. నరేన్ బౌలింగ్‌ శుభ్మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 78 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5) ఎక్కువ సేపు క్రీజులో ఉండలేక వికెట్ సమర్పించుకున్నాడు. సూర్య కుమార్ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాంత్ కిషన్‌తో కలిసి డికాక్ కేకేఆర్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు.

ఈ క్రమంలోనే ముంబయి ఓపెనర్ క్వింటన్ డికాక్ ఐపీఎల్‌లో తన 16వ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో తన అర్థ శతకాన్ని సాధించాడు. అనంతరం క్వింటన్ డికాక్ (54 పరుగులు, 42 బంతులు, 4 ఫోర్లు, 3 సిక్సులు) ప్రసీద్ధ్ బౌలింగ్‌లో 14.5 ఓవర్‌లో నరేన్‌కు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 106 పరుగుల వద్ద మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

ముంబయి యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ (14) రూపంలో టీం స్కోర్ 119 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను ఎంఐ టీం కోల్పోయింది. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో 16.2 ఓవర్‌లో రస్సెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం పొలార్డ్ 21, పాండ్యా 12 పరుగులతో నిలిచారు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రసిద్ కృష్ణ, ఫెర్గ్యూసన్ తలో 2 వికెట్లు, సునీల్ నరైన్ ఒక వికెట్ పడగొట్టారు.