జేఈఈ ర్యాంకర్లకు కేటీఆర్ అభినందనలు

జేఈఈ మెయిన్ 2020 ఫలితాలు శుక్రవారం వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాల్లో 100 పర్సంటైల్ స్కోరు సాధించింది దేశం మొత్తమ్మీద 24 మందే కాగా…వారిలో 8 మంది తెలంగాణ విద్యార్థులు ఉండడం విశేషం. తెలంగాణ విద్యార్థులు ప్రతిభ చూపించడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేసారు. “జేఈఈ మెయిన్ ఎగ్జామ్ లో తమ అమోఘమైన ప్రదర్శనతో అందరినీ గర్వించేలా చేసిన తెలంగాణ యువ కిశోరాలకు నా శుభాభినందనలు. ఓవరాల్ గా 24 మందికి 100 పర్సంటైల్ స్కోరు వస్తే వారిలో 8 మంది తెలంగాణ వాళ్లే. వాళ్లలో అమ్మాయిల విభాగం టాపర్ చుక్కా తనూజ కూడా ఉంది. అద్వితీయమైన సాధన” అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.