కేంద్రం పై పలు విమర్శలు చేసిన కేటీఆర్

అసెంబ్లీ వేదికగా కేంద్రం పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్ తాము కొత్త రోడ్లకు ఆలోచన చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం ఉన్న రోడ్లను మూసేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత అంశంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు పదిసార్లు లేఖలు రాశామని చెప్పారు. అయినా ఉలుకు పలుకు లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జీహెచ్ఎంసీలో రోడ్ల విషయమై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మండలిలో మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో రాష్ట్రం పనిచేయాలని అనుకుంటే కేంద్రం వల్ల పనులు ఆగిపోయాయని చెప్పారు. విభజన రాజకీయాలు కాకుండా రాష్ట్రం కోసం బీజేపీ ప్రజాప్రతినిధులు ఏమైనా పని చేస్తే బాగుంటుందని  సూచించారు. నాలుగు ప్రణాళికలతో హైదరాబాద్ నగరంలో రోడ్లను అభివృద్ధిచేస్తున్నామన్నారు. మిస్సింగ్‌, లింక్ రోడ్లను గుర్తించి అభివృద్ధిచేస్తున్నామని కేటిఆర్ తెలియజేసారు.