లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం..

బీహార్‌ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి విషమించింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను గురువారం హుటాహుటిన రాంచీలోని రిమ్స్‌కు తరలించారు. పశుగ్రాసం కుంభకోణం ఆరోపణల్లో జైలు శిక్ష పడిన లాలూ ప్రసాద్‌, జార్ఖండ్‌లోని రాంచీ జైలులో ఉంటున్నారు. అయితే అనారోగ్య కారణాలతో ఎక్కువ కాలం రిమ్స్‌ ఆసుపత్రిలోనే ఉన్నారు. గురువారం సాయంత్రం లాలు అస్వస్థతకు గురికాడంతో వెంటనే రిమ్స్‌కు తరలించారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆయన బాధపడుతున్నారని, ఎయిమ్స్‌ వైద్యులను సంప్రదిస్తున్నట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ కామేశ్వర్‌ ప్రసాద్‌ తెలిపారు.

మరోవైపు లాలూ కుమార్తె మిసా భారతి రిమ్స్‌కు చేరుకున్నారు. లాలూ భార్య రబ్రీ దేవి, చిన్న కుమారుడు తేజశ్వి యాదవ్‌ కూడా హుటాహుటిన ప్రత్యేక విమానంలో పాట్నా నుంచి రాంచీకి బయలుదేరారు.