కాలక్షేపానికే మంత్రి హరీష్ రావు ఎంజీఎం పర్యటన: బైరి వంశీ కృష్ణ

రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పర్యటన నెలకోసారి కాలక్షేపానికి అత్తారింటికి అల్లుడు ఒచ్చినట్టు ఉందని జనసేన పార్టి గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల తరువాత అతి పెద్ద ఆసుపత్రి అయిన ఎంజీఎంలో అనేక సమస్యలు నెలకొన్నాయి. వాటిగురించి మాట్లాడకుండా కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ భజన తప్ప ఒక్క సమస్య గురించి మాట్లాడలేదు, పేరుకే పెద్ద ఆసుపత్రి సేవలు మాత్రం అంతంతమాత్రమే కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం కోసం లక్షలు వెచ్చించే స్థోమత లేక వరంగల్ చుట్టుపక్కల ఉన్న దాదాపు 8 జిల్లాల నుంచి ఎంతో ఆశతో పెద్ద ఎత్తున ఎంజీఎం ఆసుపత్రికి వస్తుంటారు, అయితే వివిధ విభాగాల్లో పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడంతో రోగులు వెనుతిరిగి హైదరాబాద్ వెళ్తున్న సందర్భాలున్నాయి అని పేర్కొన్నారు.