లార్డ్స్ టెస్టు: ఇంగ్లండ్ కు 272 పరుగుల టార్గెట్ నిర్దేశించిన భారత్

లార్డ్స్ టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 8 వికెట్లకు 298 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా ఇంగ్లండ్ ముందు 272 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది. ఇవాళ ఆటకు చివరిరోజు కాగా, మరో 60 ఓవర్ల పాటు మ్యాచ్ సాగనుంది. వన్డే తరహాలో ఆడితే ఇంగ్లండ్ ను గెలుపు వరించే అవకాశాలు ఉన్నాయి. ఈలోపే ఇంగ్లండ్ లైనప్ ను కుప్పకూల్చితే విజయం టీమిండియా వశమవుతుంది.

కాగా, ఇవాళ్టి ఆటలో టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీ అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్యాటింగ్ లో తనకేమీ నైపుణ్యం లేకపోయినా, ఇంగ్లండ్ బౌలర్లను వారి సొంతగడ్డపైనే మొండిపట్టుదలతో ఎదుర్కొని అర్ధసెంచరీ నమోదు చేశాడు. షమీ మొత్తం 70 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో జస్ప్రీత్ బుమ్రా సైతం ఇంగ్లండ్ బౌలర్లను విసిగించాడు బుమ్రా 64 బంతుల్లో 3 ఫోర్లతో 34 పరుగులు సాధించాడు.