తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..

మహాశివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెలతెలవారుతుండగానే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి ఆలయం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి, అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి, మహానంది, కోటప్పకొండలోని త్రికూటేశ్వరస్వామి ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు.

తెలంగాణలోని వేములవాడలో కొలువైన రాజరాజేశ్వరస్వామి, కీసర రామలింగేశ్వరస్వామి, కాళేశ్వరం, రామప్ప ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇరు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో గత అర్ధరాత్రి నుంచే శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా ఆలయాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.