స్వగ్రామం చేరిన మహేష్ మృతదేహం

ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన తెలంగాణ బిడ్డ వీర జవాన్ మహేష్ మృతదేహం స్వగ్రామం చేరుకుంది. జిల్లాలోని కోమన్ పల్లి గ్రామానికి ఇవాళ తెల్లవారుజామున మహేష్ మృతదేహాన్ని ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు. మహేష్ పార్థీవదేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. జయహో జవాన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ముందుగా బోయిన్‌పల్లికి చేరుకున్న వీర జవాన్ మహేష్ మృతదేహానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. అదేవిధంగా మహేష్ మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని సీఎం ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ లోని మచిల్ సెక్టార్ లో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో మహేష్ వీర మరణం పొందిన విషయం తెలిసిందే.