కల్పవృక్ష వాహనంపై మలయప్పగా శ్రీవారు

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వరోజైన సోమవారం ఉదయం  కల్పవృక్ష వాహనంలో స్వామివారి వాహన సేవ జరిగింది. ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై స్వామి వారు చేతిలో చర్నాకోల పట్టి, తలపాగ, జాటీతో నయనానందకరంగా కనిపించారు. మంగళవాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో చుట్టూ ప్రదిక్షణ నిర్వహించారు. క్షీర సాగర మధనంలో ఉద్భవించిన కల్పవృక్షం నీడన ఉంటే ఆకలి దప్పులు ఉండవని భక్తుల విశ్వాసం. కల్పవృక్షం కింద శ్రీవారి దర్శనం కలిదోష హరణంగా భక్తులు భావిస్తారు. కరోనా మహమ్మారి సందర్భంగా వేడుకలు ఏకాంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు కల్పవృక్ష వాహన సేవను తిలకించి, తరించారు. రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు స్వామివారికి సర్వభూపాల వాహనసేవ జరుగనుంది. కార్యక్రమంలో పెదజీయర్‌ స్వామి, చినజీయర్‌ స్వామి, ఈఓ డాక్టర్‌ కేస్‌ జవహర్‌రెడ్డి, ఏఈఓ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నిశ్చిత, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, చిప్పగిరి ప్రసాద్‌, గోవింద హరి, డీపీ అనంత, కుమారగురు, సీఎఎస్‌ఓ గోపినాథ్‌ జెట్టి, చీఫ్‌ ఇంజినీర్‌ రమేశ్‌రెడ్డి, అదనపు సీవీఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి, ఆలయ డిప్యూట ఈఓ హరీంద్రనాథ్‌ పాల్గొన్నారు.