ఎంపీ రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా నరసాపురంలో భారీ ర్యాలీ

వైసీపీ, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు మధ్య యుద్ధం కొనసాగుతోంది! ఇటీవల పరిణామాల నేపథ్యంలో, రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా నరసాపురంలో నేడు భారీ ర్యాలీ జరిగింది. ఏపీ బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. రఘురామకృష్ణరాజును ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రఘురామ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. తాము ఓట్లేస్తే రఘురామ ఎంపీగా గెలిచారని, కానీ తమను మోసం చేశాడంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కాగా, వైసీపీ వెబ్ సైట్ నుంచి ఎంపీల జాబితాలో తన పేరు తొలగించారని నిన్న రఘురామ వెల్లడించారు. రఘురామ పేరును తొలగించి, ఇటీవల తిరుపతి లోక్ సభ స్థానం నుంచి గెలిచిన డాక్టర్ గురుమూర్తి పేరు చేర్చినట్టు తెలుస్తోంది.