మెగా మనసు.. పేద రోగులకు ఉచిత ప్లాస్మా..

లాక్‌డౌన్‌ సమయంలో సినీ కార్మికుల క్షేమం కోసం ఏర్పాటైన సీసీసీ మనకోసం సంస్థ ద్వారా సినీ కారిక్ముల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందించిన మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్‌ బ్యాంక్‌తో ఎంతో మందికి సాయమందిస్తూ అండగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి తన అభిమానుల సహకారంతో మరో సాయం అందించడానికి సిద్ధమయ్యారు.

మెగాస్టార్ తాజాగా కరోనా బారిన పడి నిస్సహాయులైన పేద రోగులకు ఉచిత ప్లాస్మాను తన బ్లడ్ బ్యాంకు ద్వారా వితరణ చేసేందుకు చిరు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఓ లేఖను విడుదల చేసింది. “పచ్చటి జీవితాలపై కర్మశ కరోనా పంజా విసుర్లూ చిన్నాభిన్నం చేస్తోంది. అందులో పేద రోగులు చికిత్స పొందడం గగనమవుతోంది. ఈ పరిస్థితుల్లో పేద రోగుల్ని కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సమాయత్తమైంది. కరోనా సోకి రోగ విముక్తులైనవారు ప్లాస్మాదానం చేస్తే మరికొంతమందికి ఆయుషు పోసీనట్లే. ఈ నేపధ్యంలో పేదలైన కరోనా సోకిన రోగులకు ఉచితంగా ప్లాస్మా వితరణ చేసేందుకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంది. తెల్లరేషన్‌ కార్డుదారులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషెంట్లకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ఉచితంగా ప్లాస్మా సరఫరా చేస్తోంది. పేదలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా విన్నపం. 22 సంవత్సరాలుగా మెగాస్టార్‌ శ్రీ చిరంజీవిగారు సొంత నిధులు వెచ్చించి 9 లక్షల 27 వేల మంది పేద రోగులకు చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ ద్వారా ఉచితంగా రక్తనిధులు అందించారన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసేందుకు మిక్కిలి సంతోషిస్తున్నాం” అని అందులో పేర్కొంది. పేదవాళ్ళకి అండగా నిలుస్తున్న చిరంజీవిని అందరూ ప్రశంసిస్తున్నారు.