వారణాసికి మోదీ దీపావళి కానుక

ప్రధాని సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ప్రజలకు పండుగ బహుమతి ఇచ్చారు. రూ.600 కోట్లకుపైగా ప్రాజెక్టులకు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. దీపావళి పండుగకు దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు. ‘దేశంలో తయారు కాని, గతంలో కొనుగోలు చేసిన ఉత్పత్తులను డంప్‌ చేయవద్దని, వాటిని కొనుగోలు చేయవద్దని నేను కోరడం లేదు. మట్టి దీపాలను మాత్రమే కొనడం అంటే అర్థం అది కాదు. స్థానిక ఉత్పత్తులకు చేయూతనివ్వడం’ అని మోదీ తెలిపారు. దేశీయ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇక్కడి తయారీదారుల్లో నమ్మకం పెరుగుతుందని అన్నారు. తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధిలో వారిని కూడా ప్రోత్సహించినట్లవుతుందని మోదీ చెప్పారు.