అరకు రైలుకు మరిన్ని గ్లాస్ టాప్‌ కోచ్‌లు

అరకులోయ అందాలను వీక్షించాలనుకొనే పర్యాటకులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. విశాఖ నుంచి అరకులోయ వరకు రైలుకు మరిన్ని గ్లాస్‌టాప్‌ కోచ్‌లను ప్రవేశపెడతామని తెలిపింది. ప్రస్తుతం ఒకటి మాత్రమే ఉన్న విస్టాడోమ్‌ కోచ్‌ల సంఖ్యను పెంచనున్నట్టు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి  రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ లేఖ రాశారు. విశాఖ-అరకు రైలులో ప్రస్తుతం ఉన్న ఒక ‘విస్టాడోమ్‌’కు పర్యాటకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండటంతో ఈ కోచ్‌కు అపరిమితమైన డిమాండ్‌ ఏర్పడింది. ‘విస్టాడోమ్’ కోచ్‌లో ప్రయాణానికి పర్యాటకులు రెండు నెలలు ముందుగా రిజర్వేషన్‌ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

పర్యాటకుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విశాఖ-అరకు రైలుకు మరో అయిదు ‘విస్టాడోమ్’ కోచ్‌లను ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి చేసిన విజ్ఞప్తిపై రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ స్పందిస్తూ ఆయనకు లేఖ రాశారు. విజయసాయి చేసిన విజ్ఞప్తిపై రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ సానుకూలంగా స్పందిస్తూ ఆయనకు లేఖ రాశారు. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అరకు రైలుకు మరిన్ని విస్టాడోమ్‌ కోచ్‌లను జతచేయాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు గోయల్‌ తెలిపారు. ప్రస్తుతం విస్టాడోమ్‌ కోచ్‌లు తయారీలో ఉన్నాయని, త్వరలోనే వాటిని పర్యాటకులకు అందుబాటులోని తీసుకొని వస్తామని అన్నారు.