Mumaith khan: డ్రగ్స్ కేసులో ముగిసిన ముమైత్ఖాన్ విచారణ
టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసులో మనీలాండరింగ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సినీ ప్రముఖులను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం నటి ముమైత్ఖాన్ ఈడీ ఎదుట హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ విక్రేత కెల్విన్తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఎఫ్క్లబ్లో జరిగే పార్టీలకు హాజరయ్యారా? మీరు ఎప్పుడైనా మాదకద్రవ్యాలు వినియోగించారా? మాదకద్రవ్యాలు వినియోగించే సెలబ్రిటీలతో మీకు ఏమైనా సంబంధాలున్నాయా? తదితర అంశాలపై ముమైత్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో మాదక ద్రవ్యాల కేసులో ఈడీ అధికారులు 12 మంది సినీ నటులకు నోటీసులు ఇచ్చారు. గతంలో ఎక్సైజ్ శాఖ విచారించిన వారితో పాటు ఎక్సైజ్ శాఖ విచారించని రకుల్, దగ్గుబాటి రానాలను కూడా ఈడీ విచారించింది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, దగ్గుబాటి రానా, రవితేజ, నవదీప్లను ఈడీ ప్రశ్నించింది.