మయన్మార్‌లో నిరసనకారులపై కాల్పులు.. ఏడుగురు మృతి

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమవుతున్నాయి. ఆదివారం రంగూన్‌లో రక్తం చిందింది. వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో పోలీసులు, సైనిక బలగాలను భారీగా మోహరించారు. నిరసరకారులను వారు హెచ్చరించినప్పటికీ వెనక్కి తగ్గలేదు. దీంతో టియర్‌ గ్యాస్‌ షెల్స్‌, గ్రైనైడ్లను ప్రయోగించడంతోపాటు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

అయితే సైన్యం, పోలీసులు ఉక్కుపాదం మోపినప్పటికి నిరసనల నుంచి వెనక్కి తగ్గబోమని మయన్మార్‌ ప్రజలు చెబుతున్నారు. నవంబర్‌ ఎన్నికల ఫలితాలను సైన్యం గౌరవించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని సూకీ మద్దతుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆమె పార్టీ మరోసారి ఎన్నికల్లో గెలవడంతో ఫిబ్రవరి 1న మయన్మార్‌ సైన్యం తిరుగుబాటు చేసింది. ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సూకీతోపాటు పలువురు నేతలను నిర్బంధించింది. ఆమెపై పలు అభియోగాలు మోపి కేసులు నమోదు చేసింది.

మరోవైపు మయన్మార్‌ సైనిక తిరుగుబాటును భారత్‌తోసహా ప్రపంచ దేశాలు ఖండించాయి. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని పలు దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి.