ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మైలాపల్లి శామ్యూల్?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండడంతో కొత్త ఎస్ఈసీ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, నవరత్నాల పర్యవేక్షణ సలహాదారు మైలాపల్లి శామ్యూల్, ఏపీ పునర్విభజన చట్టం అమలు బాధ్యతలు నిర్వర్తిస్తున్న రిటైర్డ్ అధికారి ఎల్ ప్రేమ చంద్రారెడ్డి పేర్లను పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో శామ్యూల్‌వైపే జగన్ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

నిజానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఐదేళ్లు, లేదంటే 65 ఏళ్లు వచ్చే వరకు పదవిలో ఉండొచ్చు. కానీ, శామ్యూల్ వయసు ప్రస్తుతం 67 ఏళ్లు. దీంతో ఎస్‌ఈసీ పదవిని ఆయనకు ఇచ్చేందుకు గవర్నర్ సానుకూలంగా లేకపోతే, అప్పుడు 65 ఏళ్ల లోపున్న నీలం సాహ్నికి ఆ పదవి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వయసుతో పనిలేకుంటే కనుక శామ్యూల్‌కే ఆ పదవి దక్కే అవకాశం ఉంది.