కరోనా చికిత్సకు లక్షల్లో ఫీజు వసూలు చేసిన నల్గొండ ప్రైవేట్ ఆస్పత్రి సీజ్

కరోనా విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల తీరు ఏ మాత్రం మారడం లేదు. కరోనాతో జనం ప్రాణ భయంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తుంటే…ఇదే అదునుగా కొన్ని ఆస్పత్రులు కరోనా పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ.. రోగుల్ని పీడించుకుతింటున్నారు. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. కోర్టులు వార్నింగ్ ఇస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉండగా.. మానవత్వం లేకుండా కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి.

తాజాగా నల్లగొండలో ఓ ప్రవైటు ఆస్పత్రి ఘటన బయటపడింది. కరోనా వైరస్ సోకిన బాధితుడి నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు నవ్య ఆస్పత్రిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ కరోనా బాధితుడి వద్ద 12 రోజుల ట్రీట్‌మెంట్‌కు రూ. 6 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆరోపణలపై విచారణ జరిపిన డీఎంహెచ్ఓ.. నవ్య ఆస్పత్రిని సీజ్ చేశారు.

కరోనా రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ హెచ్చరించారు. అయితే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పలువురు కోర్టుల్ని సైతం ఆశ్రయించారు. కోర్టు కూడా కరోనా చికిత్స వ్యవహారంలో ప్రైవేటు ఆస్పత్రుల వైఖరిని తీవ్రంగా తప్పు పట్టింది. ఆస్పత్రులపై వస్తున్న ఆరోపణలు నిజమైతే వాటి లైసెన్సు రద్దు చేసి.. ప్రభుత్వ భూములు ఇస్తే వాటిని వెనక్కి తీసుకోవాలని కూడా ఆదేశించింది.