వైసీపీ ముఖ్యమంత్రికి ‘ఆంధ్రా థానోస్’ అని నామకరణం చేస్తున్నా

* ఆంధ్రా థానోస్ కు ఆరాటం ఎక్కువ.. ఆలోచన తక్కువ
* ప్రజలను అన్ని విధాలా చంపుకొని తింటున్నాడు
* ప్రశ్నిస్తే పోలీస్ కేసులతో బెదిరింపులు
* వైసీపీ నాయకుల అక్రమాలకు, దౌర్జన్యాలకు అంతే లేదు
* పంచాయతీల నిధులను పక్కదారి పట్టించారు
* వెనుకబడిన కులాలను అగ్రవర్ణ యువత ముందుకు తీసుకురావాలి
* రాష్ట్రంలో కచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం అవసరం
* వైఎస్ కుటుంబ కోవర్టుల వల్లే ప్రజారాజ్యం పతనం
* 2014లో శ్రీ మోడీ అడిగితేనే తెలుగుదేశం కూటమికి మద్దతు
* ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం ఆపేందుకు శత్రువులతో అయినా కలవాలి
* జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం అనంతరం విలేకరులతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
* 415 అర్జీలను స్వయంగా అందుకుని, బాధితులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్

‘అవెంజర్స్ సినిమాలో థానోస్ అనే క్యారెర్టర్ ఉంటుంది.. కనిపించిన వారిని కనిపించినట్లుగా చంపుకొని పోతూ ఉంటాడు. ఆరు రత్నాల ఉంగరాలతో అత్యంత బలవంతుడిగా మారే థానోస్ కు తాను చేసింది మంచే అని అతడి భావన. ఈ క్రమంలో సగం మందిని చంపేస్తాడు. అతడు ఎవరు చెప్పినా వినిపించుకోడు. నేను చేసిందే సరైనది అనేది థానోస్ భావన. మన ఆంధ్రా థానోస్ కూడా అంతే. నవరత్నాలతో ప్రజలకు అంతా మేలు చేసేస్తున్నామని అనుకుంటాడు. ఎవర్నీ వదలకుండా చంపేస్తున్నాడు. మన ఆంధ్రా థానోస్ కు ఆరాటం ఎక్కువ. ఆలోచన తక్కువ. నన్ను దత్త పుత్రుడు అని పిలుస్తున్నారు కదా..? ఇక నుంచి వైసీపీ ముఖ్యమంత్రిని ఆంధ్రా థానోస్ గా పిలుస్తాను.. అలా నామకరణం చేస్తున్నాను’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఈ వైసీపీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ చేపట్టిన జనవాణి – జనసేన భరోసా యాత్ర కార్యక్రమం నాలుగో విడతగా తిరుపతిలో ఆదివారం జరిగింది. కార్యక్రమంలో రాయలసీమలోని నాలుగు జిల్లాల ప్రజలతోపాటు నెల్లూరు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పవన్ కళ్యాణ్ గారికి తమ సమస్యల మీద అర్జీలు సమర్పించారు. మొత్తం 415 అర్జీలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అందుకుని, బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “జనవాణి కార్యక్రమం వల్ల రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద, ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ఎన్నో విషయాలు మా దృష్టికి వచ్చాయి. రోడ్లు, ఫీజు రియంబర్స్మెంట్, టిడ్కో ఇళ్లు, వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, కబ్జాలు, అక్రమ మైనింగ్, శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం దోపిడీ… ఇలా ఎన్నో ఎన్నెన్నో విషయాలు మాకు తెలిశాయి. కోస్తాలో దళితులకు అన్యాయం జరిగితే వారు చెప్పగలరు.. కానీ రాయలసీమ ప్రాంతంలో దళితులకు అన్యాయం జరుగుతున్నా వారిని అవమాన పరుస్తున్నా బయట కూడా చెప్పలేని దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. విజ్ఞాన భూమిగా పేరొందిన రాయలసీమలో ప్రస్తుతం యువతకు ఉపాధి లేక అల్లాడుతున్నారు. కడప లాంటి ప్రాంతానికి పరిశ్రమలు రావాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ ను ఎక్కువ మంది ముఖ్యమంత్రులు పాలించారు. గుర్రాల కోసం ప్రత్యేకంగా హార్స్ క్లబ్ లు నిర్వహించే విలాసవంతమైన నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు. వేల కోట్ల రూపాయలు అర్జించిన నేతలు ఉన్నారు. అయినా ఈ ప్రాంతం పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు. ప్రజల బతుకులు అలాగే ఉన్నాయి. సాగునీటి కాలువల పూడికలు తీయించలేని పాలకులు వాటి కోసం కనీసం రూ. 10 లక్షలు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నారు.
*అడిగితే అక్రమ కేసులే
వైసీపీ నాయకుల దౌర్జన్యాలను ప్రశ్నిస్తే, పాలన వైఫల్యాలను చెబితే వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. జనవాణి కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి తనకు వైసీపీ నేతల దౌర్జన్యాల మీద అర్జీ ఇచ్చారు. పంచాయతీ నిధుల దుర్వినియోగం గురించి అడిగితే, అతని పొలంలోని 95 మామిడి చెట్లను నరికేశారు. తొమ్మిది బోర్లు ధ్వంసం చేశారు. తప్పు ఎత్తిచూపితే కేసులతో వేధిస్తున్నారు. రకరకాలుగా బెదిరిస్తున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఏదైనా సమస్యను ఎత్తిచూపితే వారిని నాన్ బెయిలబుల్ కేసుల్లో ఇరికిస్తున్నారు. ఈ దౌర్జన్యాలను ఎదిరించాలి. కచ్చితంగా రాజకీయ చైతన్యం రాయలసీమ వాసుల్లో రావాలి. గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమానికి వచ్చిన పూతలపట్టు ఎమ్మెల్యేను ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదని ప్రశ్నించిన యువకుడిపై, అతడికి మద్దతు తెలిపిన 11 మందిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. చట్టాలను ఇష్టానుసారం ఉపయోగించి ప్రజలను బెదిరిస్తున్నారు.
*మీ మోచేతి అంబలి తాగాల్సిన అవసరం లేదు
ప్రతి కులంలోనూ ఎందరో మహానుభావులు ఉన్నారు. కానీ కొన్ని కులాల వారు మాత్రమే తాము పెద్దవాళ్ళం అనే ఆధిపత్య ధోరణిలో ఉన్నారు. వెనుకబడిన కులాల్లో జనాభా అధికంగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా మాత్రం వెనుకబడిన స్థానంలో ఉన్నారు. దీనికి ఆయా కులాలకు రాజకీయ సాధికారత లేకపోవడం కూడా ఒక కారణం. ఈ కారణంతో కొన్ని కులాలు చెప్పినట్లుగానే అధిక జనాభా ఉన్న వెనుకబడిన కులాలవారు నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అగ్రవర్ణ కులాలకు చెందిన యువత తమ వంతు బాధ్యతగా వెనుకబడిన కులాల వారికి అండగా నిలబడాలి. వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్ళాలి. రాష్ట్రంలో కులాల మధ్య అసమానతలు ఉన్నాయి. కుల దూషణలు ఎక్కువే. ఇది పూర్తిగా మారాలి. రాయలసీమ ప్రజలు మన బతుకులు ఎందుకు మారడం లేదో ఒకసారి ఆలోచించాలి. ఎందుకు మనం వెనకబడ్డాo.. దీనికి కారణం ఏంటి..? ఎందుకు మన బతుకులు మారడం లేదు అనే ఆలోచన ఇక్కడి ప్రజల్లో రావాలి. ఎస్సీల భూములు ఎందుకు కబ్జా అవుతున్నాయి.. ముస్లింల వక్ఫ్ బోర్డ్ భూములు ఎందుకు మాయమవుతున్నాయి… ఎవరు మింగేస్తున్నారు అని ఆలోచిస్తే కచ్చితంగా మీకే సమాధానం కనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి పాలన చేతకాక గ్రామ పంచాయతీల వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. చాలా పంచాయతీలకు కనీస నిర్వహణకు డబ్బులు లేవు. పంచాయతీలకు సంబంధించిన రూ. 7,653 కోట్ల నిధులను ఈ ప్రభుత్వం పక్కదారి పట్టించింది. విదేశీ విద్య పథకం ద్వారా విదేశాలకు వెళ్లిన చాలామంది విద్యార్థులు మధ్యలో ఫీజులు కట్టుకోలేక అక్కడే ఉండిపోయిన దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. వీటిపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రాయలసీమ అనగానే చాలామంది హింస, ఫ్యాక్షన్ అని అనుకుంటారు. కానీ ఇదో జ్ఞానభూమి. అత్యధిక గ్రంథాలయాలు ఉన్న ప్రాంతం రాయలసీమ. పులివెందుల ప్రాంతంలోని సరస్వతీ గ్రంథాలయం చాలా పెద్దది. ఎందరో మహనీయులు నడియాడిన నేల. అల్లసాని పెద్దన మను చరిత్ర గ్రంథంలో… “ఇక్కడ చివురు కొమ్మకు కూడా చేవ ఉంటుంది” అని రాయలసీమ గొప్పతనాన్ని వివరిస్తారు. 400కు పైగా అన్నమయ్య కీర్తనలను వెలుగులోకి తెచ్చిన రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ లాంటి మహానుభావులు పుట్టిన నేల ఇది. అంతటి గొప్ప నేలలో యువతకు పాలకులు చేస్తున్న అన్యాయాల మీద గళమెత్తే ధైర్యం రావాలి. ఆధిపత్యం మీద తిరగబడే సత్తా రావాలి. ఈ పాలకులకు డబ్బు, అహంకారం ఉంటే మడిచి ఎక్కడో పెట్టుకోండి. అంతేగాని ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసి చిన్నపాటి వ్యాపారి మురళీ దగ్గర నుంచి మెగాస్టార్ వరకు అందరూ మా ముందు చేతులు కట్టుకొని నిలబడాలి అంటే కచ్చితంగా మీ మీద తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. యువత ఒకటి గుర్తు పెట్టుకోండి… మీ నాయకుల దగ్గర ప్రేమతో చేతులు కట్టుకోండిగానీ భయంతో వద్దు.
*మూడో ప్రత్యామ్నాయం కచ్చితంగా ఉండాలి
న్యాయవ్యవస్థ విషయంలోనే సింగిల్ బెంచ్ నుంచి ఐదుగురు సభ్యుల బెంచ్ వరకు వివిధ రకాల స్థాయిలో న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయాల్లో కూడా కచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం అవసరం. జనసేన పార్టీ ఎప్పుడూ వైసీపీకో , టీడీపీ కొమ్ము కాయడానికో లేదు. మేం మార్పు కోసం బలమైన రాజకీయం చేస్తాం. కచ్చితంగా మార్పు వచ్చే వరకు నిలబడి పోరాడుతాం. బరిలో నిలుస్తామే తప్ప పారిపోయేది లేదు.
*వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ కోవర్టుల వల్లే ప్రజారాజ్యం పతనం
2009లో ప్రజారాజ్యం పార్టీ రాష్ట్రంలో బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని చాలామంది భావించారు. ఎందరో వెనుకబడిన వర్గాల వారు, మేధావులు, అభ్యుదయవాదులు మార్పు కోసం ముందుకు వచ్చారు. ఆ రోజుల్లో కొందరు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబ కోవర్టుల వల్ల పార్టీ నిలబెట్టుకోలేకపోయాం. తర్వాత వారందరికీ విధేయతకు మెచ్చి మంచి మంచి పదవులు లభించాయి. ప్రజారాజ్యం విలీనం తర్వాత.. ఒక బలమైన మార్పు తీసుకువచ్చే వరకు పోరాడాలని నిర్ణయం తీసుకున్నాను. కచ్చితంగా బరిలో నిలబడి పోరాడుతూనే ఉంటాను. ఎవరికీ తలవంచేది లేదు. సమయం కోసం వేచి చూస్తున్నాం. కచ్చితంగా మార్పుకు సమయం దగ్గర పడింది.
*2014లో మద్దతు ఇచ్చింది అందుకే…
తెలుగుదేశం పార్టీకి 2014లో మద్దతు ఇవ్వడం వెనుక ఉన్న అసలు విషయం చాలా ఉంది. కొత్తగా విభజన అయిన రాష్ట్రంలో పాలకులు చేసిన కొన్ని తప్పులకు ఆంధ్ర ప్రజలను తిడుతున్నారు అని అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి శ్రీ నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడు చెప్పాను. అప్పుడు ఆయన చెప్పిన మాట… ఇలా ఐతే దేశం విచ్చినం అవుతుందని, అలా జరగనివ్వబోమని చెప్పారు. తర్వాత శ్రీ నరేంద్ర మోదీ గారు తాము ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళుతున్నట్లు, మద్దతు కావాలని అడిగారు. దీంతో టీడీపీకీ మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. నాకు కులం అంటే గౌరవం తప్ప.. కుల పిచ్చి, కులాభిమానం ఉండదు. 2014లో మేము ఎన్నికలకు వెళ్లకుండా బేషరుతుగా మీకు మద్దతు ఇవ్వాలంటే మీరే మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి, మాతో మాట్లాడితే బాగుంటుందని శ్రీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. ఆయన ఇంటికి వచ్చి జనసేన పార్టీ మద్దతు అడిగారు. ప్రజారాజ్యం పార్టీ తర్వాత మూడవ ప్రత్యామ్నాయం పోయిందని చాలామంది బాధపడ్డారు. గతంలో జరిగిన తప్పునకు బేషరతుగా నేను క్షమాపణ చెప్పాను. మమ్మల్ని గౌరవించి, తగిన విధంగా ఆత్మాభిమానాన్ని గౌరవిస్తేనే ఎవరితో అయినా చెలిమి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో ఎవరితో కలిసి పోటీ చేయాలి అనేది ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదు. కానీ రాష్ట్రంలో ఒక విధ్వంసకర పరిపాలన ఉన్నప్పుడు శత్రువులతో కూడా కలవాల్సి ఉంటుంది. అది రాజకీయాల్లో తప్పదు. దీనిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మమ్మల్ని మా నాయకుల్ని గౌరవంగా చూసేవారు.. తగిన ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం మాకు నింపేవారు ఉంటే అప్పుడు మాట్లాడతాం.
*సజ్జల గారూ.. అహంకారం వద్దు
అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. చిత్ర పరిశ్రమ ఒక కుటుంబానిది కాదు. అందరికీ సమాన అవకాశాలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి రాజకీయాల్లో కూడా ఉండాలి. కార్తికేయ-2 సినిమా మొత్తం భారతదేశాన్ని ఊపేస్తోంది. నిఖిల్ అనే హీరో . ఒకప్పుడు దక్షిణాఫ్రికాను కేవలం శ్వేత జాతీయులు మాత్రమే పరిపాలించేవారు. నెల్సన్ మండేలా రాకతో నల్లవారు కూడా పరిపాలించే అవకాశం దక్కింది. ఇక్కడి పాలకులు కూడా వెనుకబడిన కులాలకు కచ్చితంగా ప్రాధాన్యం కల్పించాలి. సజ్జల గారూ.. ఆధిపత్య ధోరణి అంటే ఎదుటివారిని బతకనివ్వకపోవడమే. మీరు చెప్పింది వినాలి అని శాసించడమే. ఎంత పెద్ద హీరోలు వచ్చినా, స్వశక్తితో పెద్దవారు అయినా సరే.. మీ పెద్ద ప్యాలెస్ ముందు కారు దిగి నడిచి రావాలి అని మీరు ఆశించి, శాసించడమే ఆధిపత్యం… అహంకారం. దీనిని సజ్జల గారు గుర్తిస్తే బాగుంటుంది.
*వైసీపీ ముద్దు అనుకున్నారు.. ఇప్పుడు వద్దు అనండి
రాష్ట్ర ప్రజలు మరోసారి వైసీపీని చంకన పెట్టుకుంటే రాష్ట్రం పరిస్థితి ఊహించుకోవడానికి కూడా భయమేస్తోంది. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా వైసీపీ ముద్దు అనుకున్నారు… ఇప్పుడు వద్దు అనుకోండి. మరోసారి అధికారంలోకి వస్తే జపాన్ దేశంలో పెట్టినట్లు ఎక్కువ మద్యం ఎవరు తాగుతారు అన్న పోటీలను కూడా వీరు పెడతారు. బూమ్ బూమ్ పోటీలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచించండి. శ్రీ దామోదరం సంజీవయ్య గారి లాంటి గొప్ప నేతలను గద్దె ఎక్కించిన రాయలసీమ నేల ఇది.. ఈ గడ్డ నుంచే చెబుతున్నాం… మార్పు వచ్చేవరకు పోరాడుతాం. వెన్ను చూపేది లేదు. ఒక ఎన్నికల్లో గెలుపు కోసం వచ్చే నేతలు మాకు వద్దు. మాతో కలిసి ప్రయాణం చేసి, మా వాళ్ళని గౌరవంగా చూసే నేతలు వస్తే మాత్రం కచ్చితంగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తాం. ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం వ్యూహాలను మొదలుపెట్టాం. కచ్చితంగా అవి వైసీపీ పాలనను అంతం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చివరి శ్వాస వరకు పని చేస్తాను అని మాత్రం సగర్వంగా చెబుతున్నాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *