నారాయణ స్వామి నమ్మక ద్రోహి, రెడ్ల ద్వేషి..!: యుగంధర్

ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామి నమ్మక ద్రోహి, రెడ్ల ధ్వేషని జి డి నెల్లూరు నియోజక వర్గ జనసేన ఇన్ ఛార్జ్ పొన్నా యుగంధర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. నియోజక వర్గంలో రెడ్ల వర్గ పోరు వల్ల తాను ఓడిపోవలసి వస్తుందని మొసలి కన్నీరు కారుస్తున్న స్వామి అందుకు కారకులు తానేనని గుర్తించాలన్నారు. తొలి నుంచి ఆయనకు రెడ్లంటే పడదని చెప్పారు. వారి వల్ల లాభం పొంది వారికే ద్రోహం చేయడం ఆయనకు అలవాటు అన్నారు. తాను రాజకీయంగా ఎదగడానికి కారకుడైన రెడ్డివారి రాజమన్నార్ రెడ్డి జయంతి, వర్ధంతిని కూడా మరచిపోయిన మిత్ర ద్రోహి అన్నారు. తనను సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యేగా చేసిన మాజీ మంత్రి చెంగా రెడ్డిని మర్యాద పూర్వకంగా కూడా కలవడం లేదన్నారు. పచ్చికాపల్లంలో మహాభారతం పేరుతో రెడ్లు, దళితుల మధ్య గొడవలు పెట్టారని విమర్శించారు. కార్వేటినగరం మండలానికి చెందిన పి. ధనంజయ రెడ్డి, బండి జగదీష్ స్వామి గెలుపు కోసం లక్షలు ఖర్చు చేశారని తెలిపారు. అయితే ఆయన అధికారం చేపట్టిన తరువాత వారిని పక్కన బెట్టి.. డబ్బు కోసం కొత్తవారిని చేరదీసి పనులు చేస్తున్నారని ఆరోపించారు. వెదురుకుప్పంలో పార్టీకి తొలి నుంచీ సేవలు అందించిన పేట ధనంజయ రెడ్డిని కాదని.. సఫర్యలు చేసిన వారికి పదవులు కట్ట బెట్టారని దుయ్య పట్టారు. పెనుమూరులో ప్రభుత్వ సలహాదారు ఎం జ్ఞానేంద్ర రెడ్డికి పొటీగా టిడిపి నుంచి వచ్చిన పి.కృష్ణా రెడ్డిని తయారు చేస్తున్నారని తెలిపారు. జి డి నెల్లూరులో బాబు రెడ్డిని, ఆయన వర్గీయులను అణచివేశారని చెప్పారు. దీని వల్ల కొందరు రెడ్లు తమ అస్తిత్వం కాపాడుకోవడానికి వర్గాలు ఏర్పరచు కుంటున్నారని వివరించారు. గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న మాజీ మంత్రులు డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ, గాలి ముద్దుకృష్ణమ నాయుడు రెడ్లతో పాటు అన్ని వర్గాలను కలుపుకుని పనిచేశారని గుర్తు చేశారు. నారాయణ స్వామికి మంత్రి పదవి రాకపోయి వుంటే జగన్ మోహన్ రెడ్డిపైన కూడా విమర్శలు చేసే వారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను జనసేన టిక్కెట్టుపై పోటీ చేసి స్వామిపై భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని యుగంధర్ ధీమా వ్యక్తం చేశారు.