టైమ్స్ ప్రభావశీల వ్యక్తుల జాబితాలో నరేంద్ర మోడీ

టైమ్స్ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీకి స్థానం దక్కింది. అలాగే 2020 ఏడాదికి టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన జాబితాలో ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో సిఎఎకి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలకు ప్రతిబింబంగా మారిన 82 ఏళ్ల వృద్ధ మహిళతోపాటు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా చోటు సంపాదించుకున్నారు. తమ వృత్తి జీవితాలలో అసమాన విజయాలు అందుకున్న వ్యక్తులు, నటులు, నాయకులు, దిగ్గజాలు, విశిష్ట వ్యక్తులు తదితరులను ప్రతి సంవత్సరం టైమ్ మ్యాగజైన్ ప్రభావశీలురైన వ్యక్తులుగా ఎంపికచేస్తుంది. ఇటీవలే 70వ వసంతంలోకి ప్రవేశించిన ప్రధాని నరేంద్ర మోడీ నాయకుల విభాగంలో ఎంపిక కాగా, షహీన్‌బాగ్ దాదీగాపేరు పొందిన బిల్కీస్‌కు విశిష్ట వ్యక్తుల విభాగంలో చోటు దక్కింది. ప్రధాని నరేంద్ర మోడీకి 2017లో టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన జాబితాలో కూడా స్థానం లభించింది.