రెండు రోజులపాటు రాష్ట్రంలో నిమ్మగడ్డ పర్యటన..

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్రంలో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి ఆయన పలు జిల్లాల్లో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. శుక్రవారం అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తారు. రేపు ఉదయం 7.40 గంటలకు విజయవాడ నుంచి బెంగళూరు పయనం అవుతారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకుంటారు. పంచాయతీ ఎన్నికలపై అనంతపురం జిల్లా అధికారులతో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు సమీక్ష చేపడతారు.

అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు కర్నూలు బయల్దేరి వెళతారు. సాయంత్రం 5.30 గంటలకు కర్నూలు చేరుకుని జిల్లా అధికారులతో సమావేశమవుతారు. ఈ సమావేశం సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు సాగనుంది. ఆపై, ఎస్ఈసీ కర్నూలులోనే బస చేయనున్నారు.

శనివారం ఉదయం 6 గంటలకు కర్నూలు నుంచి కడప పయనమవుతారు. కడపలో జిల్లా అధికారులతో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తారు. సమావేశం అనంతరం ఉదయం 11.30 గంటలకు కడప నుంచి విజయవాడ పయనం అవుతారు.