స్థానిక ఎన్నికలపై సింగిల్ బెంచ్ తీర్పు పట్ల డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన ఎస్ఈసీ

ఏపీ లో ఇటీవల పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ షెడ్యూల్ ను నిలుపుదల చేసింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని ఎస్ఈసీ తరఫు న్యాయవాది తమ పిటిషన్ లో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుసగా సెలవులు ఉన్నందున, అత్యవసర పిటిషన్ గా భావించి విచారణ జరపాలని డివిజన్ బెంచ్ కు విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. ఎన్నికల షెడ్యూల్ పై ఎస్ఈసీ నిర్ణయం సరికాదని పేర్కొంది.