బడ్జెట్ ప్రతులతో క్యాబినెట్ సమావేశానికి బయలుదేరిన నిర్మల!

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కు మరికాసేపట్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలుపనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బడ్జెట్ ప్రతులతో కలిసి క్యాబినెట్ సమావేశానికి బయలుదేరారు. మోదీ అధ్యక్షతన సమావేశం కానున్న క్యాబినెట్ ఈ బడ్జెట్ కు ఆమోదం తెలుపనుంది. ఆపై ఉదయం 11 గంటల సమయంలో పార్లమెంట్ ముందుకు రానుంది.

కాగా, గత సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే, వాస్తవ కేటాయింపులు సమూలంగా మారిపోయాయన్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ కారణంగా, బడ్జెట్ కేటాయింపులు ఎన్నో రంగాలకు జరగలేదు. లాక్ డౌన్ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయి. నిధులను దారి మళ్లిస్తూ, ఎప్పటికప్పుడు మార్చాల్సి వచ్చింది. ఈ సంవత్సరం వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందన్న ఆర్థిక సర్వే అంచనాల నేపథ్యంలో నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది.