ఐపీఎల్‌లో ఇంగ్లండ్‌ ఆడే అవకాశం లేదు: ఈసీబీ

కరోనా వైరస్‌ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌ రీషెడ్యూల్‌ అయితే తమ ప్లేయర్లు బరిలోకి దిగే అవకాశం లేదని ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) స్పష్టం చేసింది. భవిష్యత్‌ పర్యటనల ప్రణాళిక(ఎఫ్‌టీపీ) ప్రకారం తాము వరుస సిరీస్‌లతో బిజీగా ఉన్నామని ఈసీబీ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆష్లే గైల్స్‌ పేర్కొన్నాడు. గైల్స్‌ మంగళవారం స్పందిస్తూ ‘ఎఫ్‌టీపీ షెడ్యూల్‌ ప్రకారం ఇంగ్లండ్‌ సీజన్‌ బిజీగా ఉంది. జూన్‌లో న్యూజిలాండ్‌తో మొదలుపెడితే భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌, సెప్టెంబర్‌, అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ పర్యటనలు ఉన్నాయి. ఇది ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్‌, ఆస్ట్రేలియాతో యాషెస్‌ సిరీస్‌ ఇలా వరుస సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఆడటమనేది కష్టం’ అని అన్నాడు.