ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ.. సరిహద్దుల వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు

కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. రామాపురం (కోదాడ), పొందుగుల (వాడపల్లి), నాగార్జునసాగర్ (మాచర్ల వైపు) మూడు చెక్ పోస్టులను మూసివేసింది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సరిహద్దుల వద్ద వాహనాలు బారులు తీరాయి. అత్యవసర సేవలు మినహా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. 

కాగా, నేటి నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం నిన్ననే ప్రకటించింది. ఈ నెల 18 వరకు కర్ఫ్యూ కొనసాగనుండగా విమాన, రైల్వే ప్రయాణికులను టికెట్లు చూపిస్తే మాత్రం అనుమతిస్తారు. ఇక, కర్ఫ్యూ నుంచి  పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు మినహాయింపు ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు, సిబ్బందికి ఆంక్షల నుంచి మినహాయింపు నిచ్చారు.