కొనసాగుతున్న అమరావతి రైతుల ‘మహాపాదయాత్ర’

అమరావతినే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది.

న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన ఈ యాత్ర ఇవాళ గుంటూరు శివారు అమరావతి రోడ్డు నుంచి ప్రారంభమైంది. నేడు 10.8 కిలోమీటర్ల మేర చేసే ఈ పాదయాత్ర గుంటూరు నగరంలో కొనసాగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు గుంటూరు నగరవాసులు సంఘీభావం తెలిపారు. యాత్రలో తెదేపా నేత ఆలపాటి రాజా, చలసాని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర ఇవాళ పుల్లడిగుంటలో యుగియనుంది. అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రారంభించిన మహాపాదయాత్ర.. 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది.