పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ పోలింగ్ నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, కరోనా బాధితులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పెట్టింది. వీరితోపాటు ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు, వికలాంగులు, సర్వీస్‌ ఓటర్లు కూడా వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుని పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓటు వినియోగించుకోవచ్చునని ఎన్నికల సంఘం పేర్కొంది.