తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు ఆగస్టులో ఒరిజినల్ మెమోలు..

తెలంగాణ లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో పరీక్షలు లేకుండానే ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయించారు. ఇక ప్రస్తుతం విద్యార్థుల కోసం మెమోలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. అయితే ఒరిజినల్ మెమోలను విద్యార్థులకు ఆగస్టులో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈసారి మెమోల జారీకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నకిలీ, బోగస్ మెమోలను అరికట్టడంలో భాగంగా బార్‌కోడ్‌తోపాటు మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్లను అందించనున్నారు. మెమోల్లో తప్పులు దొర్లితే మళ్లీ మార్పులు, చేర్పులు చేయడం కష్టం, సమయంతో కూడుకున్న విషయం కాబట్టి మొదటిసారి ముద్రించే సమయంలోనే జాగ్రత్తలు తీసుకొని ఆలస్యమైనా తప్పులు లేకుండా మెమోలను అందజేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఆగస్టు మొదటి వారంలో ఒరిజినల్ మెమోలను అందజేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అప్పటి వరకు స్కూల్ లాగిన్‌ ఐడీనుంచి ప్రింట్ తీసి.. ప్రధానోపాధ్యాయులు సంతకం చేసిన మెమోలను ప్రస్తుతానికి వినియోగించుకోవచ్చని సూచించారు. ఇదిలా ఉంటే.. పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5 ,21 ,073 మంది విద్యార్థులను ప్రభుత్వం ఉత్తీర్ణులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారు ఉన్నారు. రెగ్యులర్ గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,62,917 మంది విద్యార్థులు బాలురు.. 2,53,661 మంది బాలికలు ఉన్నారు. ఇక 2 ,10,647 మంది విద్యార్థులు 10/10 జి.పి.ఎ సాధించారు. ఇక మొత్తం 535 పాఠశాలలు 10/10 జి.పి.ఎ. సాధించాయి.