త్వరలోనే ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభోత్సవం
త్వరలోనే ఓర్వకల్లు ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ఉంటుందని ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రకటించారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్లో కమర్షియల్ ఆపరేషన్కు సంబంధించిన అనుమతుల గురించి కేంద్రంతో మాట్లాడానని, ఈ విమానాశ్రయాన్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి బుగ్గన వెల్లడించారు.
బుధవారం ఢిల్లీలోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో రాష్ట్రంలోని సివిల్ ఏవియేషన్ పెండింగ్ పనులపై ఆయన చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్.. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయం కమర్షియల్ ఆపరేషన్కు సిద్ధంగా ఉందని తెలిపారు. దానికి సంబంధించిన అనుమతులపై కేంద్రమంత్రితో మాట్లాడానని చెప్పుకొచ్చారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టు షిఫ్టింగ్ పనులు, టెక్నికల్ అంశాలపై కూడా చర్చించామన్నారు. అన్ని అంశాలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ వివరించారు. కాగా, తొందరలోనే భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన కూడా జరుగుతుందని పేర్కొన్నారు.