కమల్‌ హాసన్‌తో జత కట్టనున్న ఒవైసీ!

ఎంఐఎం పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది.. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్ , తెలంగాణ శాసనసభలలో ఎంఐఎం సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ఈ మధ్య జరిగిన బీహార్ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచి ఊపు మీదున్న ఆ పార్టీ ఇప్పుడు తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2021 ఏప్రిల్‌ లేదా మేలో జరిగే ఎన్నికల్లో 25 స్థానాలకు తగ్గకుండా ఎంఎంఐ పోటీ చేయనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనికోసం మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కమల్‌ హాసన్‌తో జతకట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తమిళనాడులోని ఎంఐఎం నేతలతో సోమవారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో ఒవైసీ భేటీ అయ్యారు. ఆ రాష్ట్ర ఎన్నికలపై సదరు నేతలతో చర్చించినట్లు ఒవైసీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ఎంఐఎం అక్కడ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. హైదరాబాద్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటి 44 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ఊపుమీద ఉన్న ఎంఐఎం తమిళ ఎన్నికలపై దృష్టిసారించింది. తమిళనాడులో పలు ముస్లిం పార్టీలు ఉన్నప్పటికీ అవి ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలను ఏకం చేసి ఎన్నికల్లో పాల్గొనాలని ఒవైసీ యోచిస్తున్నారు. మక్కల్‌ నీది మయ్యమ్‌ (కమల్‌ హాసన్‌ పార్టీ), నామ్ తమిళర్‌ వంటి పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు. వెల్లూర్‌, రాణిపేట్‌, తిరుపత్తూర్‌, కృష్ణగిరి, త్రిచీ, తిరునెల్వేలి జిల్లాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆ ప్రాంతాలతోపాటు మరికొన్నింటిల్లో పోటీ చేసేందుకు మజ్లిస్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం.