ఆక్స్‌ఫర్డ్‌ టీకా తుది దశ క్లీనికల్ ట్రయల్స్

కొవిడ్‌ను ఎదుర్కొనే అత్యంత ప్రభావవంతమైన టీకాల్లో ఒకటిగా భావిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా మూడో దశ ట్రయల్స్‌ మళ్లీ సోమవారం నుంచీ ప్రారంభంకానున్నాయి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పుణెకు చెందిన సస్సోన్ జనరల్ ఆస్పత్రిలో ఈ ట్రయల్స్ జరగనున్నాయి. ‘కోవీషీల్డ్(ఆక్స్‌ఫర్డ్ టీకా) వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేజ్-3 క్లీనికల్ ట్రయల్స్ సోమవారం నుంచీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని’ అని సస్సోన్ జనరల్ ఆస్పత్రి డీన్ మురళీధర్ తంబే ప్రకటించారు.

ఈ తుది దశ టీకా పరీక్షల్లో 150 నుంచి 200 మంది వలంటీర్లు పాలుపంచుకోనున్నారు. ఇప్పటికే కొంత మంది తమ పేర్లు నమోదు చేసుకున్నట్టు మురళీధర్ తెలిపారు. ఈ ట్రయల్స్‌లో పాలుపంచుకోవాలనుకుంటున్న వారు ఆస్పత్రిని సంప్రదించాలని ఆయన సూచించారు. ఆక్సఫర్డ్ టీకాకు సంబంధించి రెండో దశ ఫేజ్-2 క్లీనికల్ ట్రయల్స్‌ను పూణెకు చెందిన భారతీ విద్యాపీఠ్ మెడికల్ కాలేజ్, కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో జరిగాయి.