Srinugavarapukota: స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జనసైనికుల పాదయాత్ర

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్.కోట నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సింహాచలం వరకు పాదయాత్ర నిర్వహించారు. కొత్తవలస జంక్షన్ లో పార్టీ నాయకులు వబ్బిన సత్తిబాబు, గొరపల్లి రవికుమార్, వబ్బిన సన్యాసి నాయుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి యాత్ర ప్రారంభించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్తవలస, పెందుర్తి, వేపగుంట మీదుగా సింహాచలం తొలిపావంచా వరకు పాదయాత్ర సాగింది. మార్గ మధ్యలో ప్రజలను కలుస్తూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రచారంచేశారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జనసేనపార్టీ నిబద్ధతతో కృషి చేస్తోందన్నారు. 31 వ తేదీ ఆదివారం గాజువాకలో నిర్వహించనున్న పవన్ కల్యాణ్ సభకు భారీగా ప్రజలు హాజరై ఉక్కు ఉద్యోగులు, బాధితులకు బాసటగా నిలవాలని కోరారు. సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మల్లువలస శ్రీను, పార్టీ నాయకులు శ్రీనివాస రాజు, చిన్ని, చంటి, పవన్, రాజు మారె, ముచ్చకర్ల శ్రీను, నక్క శ్రీను, నక్క ప్రభాకర్ పాల్గొన్నారు.