భారత్ నుంచి చక్కెర, పత్తి దిగుమతిపై పాక్ యూటర్న్

భారత్ నుంచి చక్కెర, పత్తిని దిగుమతి చేసుకోనున్నట్టు ప్రకటించిన ఒక్క రోజులోనే పాకిస్థాన్ యూటర్న్ తీసుకుంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత భారత్‌తో పాకిస్థాన్ వాణిజ్యపరమైన సంబంధాలను రద్దు చేసుకుంది. అయితే, రాబోయే రంజాన్‌ను పురస్కరించుకుని భారత్ నుంచి చక్కెర, పత్తి, గోధుమలను దిగుమతి చేసుకోనున్నట్టు బుధవారం ప్రకటించింది. అంతలోనే ఏమైందో కానీ, నిన్న మాట మార్చింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ ఆర్థికమంత్రి నిన్న ప్రకటించారు.

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్.. భారత్ నుంచి పత్తి, పంచదారను దిగుమతి చేసుకోవాలన్న ఎకనమిక్ కో ఆర్డినేషన్ కమిటీ సూచనలను తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్‌కు మునుపటిలా మళ్లీ స్వయంప్రతిపత్తి కల్పిస్తేనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం కొనసాగుతుందని, లేదంటే లేదని ఆ దేశ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెగేసి చెప్పారు.