ఏపీలో మొదలైన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ లో పంచాయతీ ఎన్నికల పోరు నేడు ప్రారంభమయింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నేడు తొలిదశ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలు ఈరోజు ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. విజేతలను ప్రకటించనున్నారు. అలాగే వీలైతే ఇవాళే, లేదంటే బుధవారం ఉప సర్పంచ్‌ ఎన్నిక సైతం పూర్తి చేయనున్నారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం మధ్యాహ్నం 1.30 వరకే పోలింగ్‌ కొనసాగనుంది. మొదటి విడతలో 2,723 సర్పంచ్‌ స్థానాలకు, 20,157 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్‌ బరిలో 7,506 మంది, వార్డులకు 43,601 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.