ప్రయాణికులు మెట్రో ప్రయాణానికి సిద్ధంకండి

దేశం మొత్తం అన్‌లాక్‌-4 అమలు కాగా ఆ మార్గదర్శకాలను అనుసరించి నగరంలో హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులు మెట్రో రైళ్ల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో దానికి అనుగుణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెట్రో స్టేషన్లలో, రైళ్లలో అధికారులు వివిధ ఏర్పాట్లు చేశారు.

మెట్రో రైల్‌ సేవలను ఈ నెల 7వ తేదీ (సోమవారం) నుండి అందుబాటులోకి తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రయాణికులు మెట్రో స్టేషన్‌లోకి రాగానే థర్మల్‌ స్క్రీనింగ్‌ మరియు శానిటైజ్‌ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ప్రయాణికుడిని థర్మల్ స్క్రీనింగ్‌ చేసిన అనంతరం మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. కరోనా కారణంగా మెట్రో స్టేషన్లలో టోకెన్ల జారీ ప్రక్రియను పూర్తిగా రద్దు చేశామని తెలిపారు. స్మార్ట్‌ కార్డు లేదా ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్‌ చేసుకోవాలని, క్యూ ఆర్‌ కోడ్‌ స్కానింగ్ ద్వారా ప్రయాణించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. కౌంటర్‌ వద్ద కూడా భౌతికదూరం పాటించే విధంగా మార్కింగ్‌ వేశారు. రైళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలని నిర్ణయించారు.

మెట్రో సిబ్బందికి పీపీఈ కిట్లు ఏర్పాటు చేశారు. సీసీటీవీల ద్వారా నిరంతరం ప్రయాణికుల రాకపోకలను గమనిస్తామని భౌతికదూరం పాటించని వారిని అప్రమత్తం చేస్తామని అధికారులు తెలిపారు. రైళ్లలో సీటింగ్‌ విధానంలో కూడా పలు మార్పులు చేశారు. ప్రతి బోగీలో మార్కింగ్ చేసిన చోట మాత్రమే ప్రయాణికులు నిల్చునే, కూర్చునే లా ఏర్పాటు చేశారు.