రెడ్డి గారి ప్రభుత్వానికి ఎందుకంత భయం.. ప్రభుత్వ వైఖరిపై పవన్ ఫైర్..

రామతీర్థ యాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఏపీ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎందుకంత భయమని నిలదీశారు. పోలీస్ ఒత్తిళ్లకు బెదరక నిరసన కార్యక్రమాలకు సన్నద్ధమైన జనసేన నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రామతీర్థం కొండ దగ్గరకు చేరుకొని ప్రజా నిరసనను తెలియచేసిన వారికి పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు.

భావవ్యక్తీకరణ చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కు అని గుర్తు చేశారు. ఇటువంటి హక్కును జగన్ రెడ్డి గారి ప్రభుత్వం హరించి వేయడం ప్రజాస్వామ్యానికే విఘాతమన్నారు. జనసేన, బీజేపీలు తలపెట్టిన రామతీర్థ ధర్మ యాత్రను అడ్డుకోవడానికి పోలీసులు, ఏపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర జిల్లాల వారినే కాకుండా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా జనసేన నాయకులు, కార్యకర్తలను గృహ నిర్బంధం చేసిందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేదాకా పోరాటం ఆగదని హెచ్చరించారు.