టీడీపీ కార్యాలయాలపై దాడులను ఖండించిన పవన్ కల్యాణ్

ఏపీలో టీడీపీ ఆఫీసులపై దాడిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. దీనిపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, జనసేన ఐటీ వింగ్ కు సంబంధించిన సమావేశంలో ఉండగా రాష్ట్రంలో టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగినట్టు సమాచారం అందిందని తెలిపారు. తనకు తెలిసినంతవరకు రాష్ట్రంలో పార్టీ ఆఫీసులపై దాడులు జరగడం ఇదే ప్రథమం అని పేర్కొన్నారు. ఇలాంటి దాడుల సంస్కృతి ప్రజాసంక్షేమానికి ఏమాత్రం క్షేమకరం కాదని స్పష్టం చేశారు. పార్టీ ఆఫీసులపైనా, నాయకుల ఇళ్లపైనా దాడులు చేస్తే అది అరాచకానికి, దౌర్జన్యానికి దారితీస్తుంది తప్ప, అది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదని పవన్ అభిప్రాయపడ్డారు.

దీనిపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించాలని పవన్ కోరారు. ఏపీ పోలీసు విభాగం కూడా సత్వరమే దీనిపై చర్యలు తీసుకోవాలని, దోషులను పట్టుకుని శిక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ అరాచకానికి చిరునామాగా మారుతుందని స్పష్టం చేశారు. వైసీపీ నేతలే ఇవాళ్టి దాడులకు పాల్పడ్డట్టు చెబుతున్నారని, భవిష్యత్తులో ఇలాంటి ధోరణులను వైసీపీ నేతలు నియంత్రించుకోకపోతే ప్రజాస్వామ్యానికి అది గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.