హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించిన పవన్ కల్యాణ్

కరోనా సమయం నుండి తన ఫాంహౌజ్‌కి పరిమితం అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం మియాపూర్ వెళ్లారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషన్ లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు. ఈ మెట్రో ప్రయాణంలో భాగంగా అమీర్ పేట స్టేషన్లో ట్రైన్ మారారు ఈ సందర్భంలో తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. మియాపూర్‌ వెళ్లే సమయంలో తన పక్కన కూర్చున్న ద్రాక్షారామంకు చెందిన రైతుతో మాట్లాడారు పవన్‌. పంటల గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతు చెప్పగానే పవన్ కళ్యాణ్ నవ్వుతూ మీకే కాదు నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి అని అన్నారు. మెట్రోలో పవన్‌ కళ్యాణ్ తో పాటు నిర్మాత దిల్‌రాజు కూడా ప్రయాణించారు.