గద్దర్ ని పరామర్శించిన పవన్ కళ్యాణ్

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రజా గాయకుడు గద్దర్ ను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ గద్దర్ గారు త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాలు, దేశ రాజకీయ పరిస్థితులపై కొంతసేపు ముచ్చటించుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తనను పరామర్శించినందుకు గద్దర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాజకీయం పద్మవ్యూహం వంటిదని అతి జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా గద్దర్ అన్నారు. ప్రస్తుతం భారతదేశం యువతతో నిండి ఉందని , 60 శాతం మంది యువతే ఉన్నారని ఆయన అన్నారు. ఇటువంటి యువతకు నీ వంటి యువ నాయకుల నాయకత్వం ఎంతో అవసరమని వ్యాఖ్యానిస్తూ విజయం నీదేనని ఒక అన్నగా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.