20న కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
•జనసేన కౌలు రైతు భరోసా యాత్ర…. సిద్ధవటంలో రచ్చబండ
జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 20వ తేదీ శనివారం ఉమ్మడి కడప జిల్లాలో పర్యటిస్తారు. సాగు నష్టాలు, అప్పుల బాధలతో కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. అనంతరం రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. రైతు కుటుంబాల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలో పూర్తయ్యింది. ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో తొలి విడత పూర్తయిన విషయం తెలిసిందే.