కేసీఆర్ గారు త్వ‌ర‌గా కోలుకోవాలి: ప‌వ‌న్ క‌ల్యాణ్

కరోనా బారిన పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నం కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానన్నారు. వారికి కోవిడ్ స్వల్ప లక్షణాలే ఉన్నాయనీ, ఎలాంటి ఇబ్బందీ లేదని వైద్యులు చెప్పడం తెలంగాణ ప్రజలందరికీ ఊరట కలిగిస్తోందిన్నారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కరోనాతో ఎయిమ్స్‌లో చేరినట్లు తెలిసిందని, ఒక ఆర్థికవేత్తగా, దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఆయన త్వరగా కోలుకుని, ఆరోగ్యవంతులు కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.