వైసీపీని ఎప్పుడు ఇంటికి పంపాలా అని ప్రజలు వేచి చూస్తున్నారు

• జనసేన పోటీ చేసే ప్రతి సీటులో భారీ విజయం సాధించాలి
• త్రికరణ శుద్ధితో 90 రోజులు పని చేద్దాం
• బలంగా ఎలక్షనీరింగ్ చేద్దాం
• పోలింగ్ బూత్ వరకు స్ఫూర్తిని తీసుకొద్దాం
• క్రియాశీల వాలంటీర్ల సేవలు పార్టీకి కొండంత బలం
• అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాం
• తెనాలిలో క్రియాశీలక వాలంటీర్లతో సమావేశం అయిన శ్రీ నాదెండ్ల మనోహర్

‘పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ గెలుపొందడమే మన ముందున్న లక్ష్యం. దీని కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాలి. దీని కోసం ప్రతి క్రియాశీలక కార్యకర్త ప్రాణం పెట్టి పని చేయాలి. 90 రోజులు మాత్రమే మనకు సమయం ఉంది. ఈ సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం వెచ్చించాల’ని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపాలా.. అని ప్రజలు వేచి చూస్తున్నారు అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ గురించి ప్రజలే వాకబు చేయడం అంటే ఈ ప్రభుత్వం పట్ల వారు ఎంత కోపంగా ఉన్నారో అర్ధమవుతుందని చెప్పారు. ప్రజలను జాగ్రత్తగా ఓటింగ్ వరకు తీసుకురావాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ వాలంటీర్లు, సభ్యుల సేవలను పూర్తిస్థాయిలో ఎలా వినియోగించుకోవాలన్న దానిపై సోమవారం తెనాలిలోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘90 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. దీనిలో మళ్లీ పండుగల హడావుడి పోతే… ఇంకా తక్కువ సమయం మాత్రమే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీకి 6.65 లక్షల పైబడి క్రియాశీల కార్యకర్తలున్నారు. వారిని పార్టీకి అనుసంధానం చేసిన సుమారు 13 వేల మంది వాలంటీర్లు పార్టీకి ముఖ్య బలం. మారుమూల గ్రామాల్లోకి కూడా వెళ్లి పార్టీలోకి క్రియాశీలక సభ్యులను చేర్పించిన వాలంటీర్లు మరోసారి ఎన్నికల సమయంలో పటిష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గాల వారీగా ఉన్న జనసేన క్రియాశీల వాలంటీర్లు తమ పరిధిలోని సభ్యులను ఒక్కటిగా చేసి, ఎన్నికల వేళ పార్టీ అప్పగించే కార్యక్రమాలను త్రికరణ శుద్ధిగా చేస్తే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు సుసాధ్యం. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో క్రియాశీలక వాలంటీర్లు చురుగ్గా పనిచేసి, పార్టీ కోసం కొంత సమయం వెచ్చించాల్సిన సమయం వచ్చింది. పార్టీలోకి క్రియాశీల సభ్యులే కాకుండా, వారి బంధువులు, సానుభూతిపరులను ఒక్కటి చేయాల్సిన అవసరం ఉంది. పోలింగ్ ఏజెంట్లుగానూ పని చేయాలి. దీని కోసం ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకొని పటిష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని, ఎక్కడా పొరపొచ్చాలకు తావులేకుండా ముందుకు వెళ్లాలి. క్రమశిక్షణగా పార్టీ ఆదేశించే ప్రతి పని చిత్తశుద్ధితో నిర్వహించాలి.
• ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో జల్లెడ పట్టండి
వచ్చే ఎన్నికలకు సంబంధించి అతి త్వరలోనే తుది ఓటరు జాబితా వస్తుంది. దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించాలి. జనసేన – తెలుగుదేశం పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమం ఉంటుంది. అలాగే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో చేస్తున్న డోర్ టూ డోర్ క్యాంపెయిన్ లోనూ పాల్గొవాలి. రెండు పార్టీలు ఎప్పటికప్పుడు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇంటి వద్దనే ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. దీన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి, నిర్వహించాలి. అలాగే 18 ఏళ్లు నిండి కొత్తగా వచ్చిన ఓటర్లు సైతం రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 15 లక్షల మంది వరకు ఉంటారు. తెనాలి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో కొత్త ఓటర్లు 6,700 మంది ఉన్నారు. వారందరికీ పార్టీని దగ్గర చేయాలి. దీనికి వారధిగా క్రియాశీల వాలంటీర్లు, కార్యకర్తలు పనిచేయాలి.
• ఎన్నికల నిర్వహణ చాలా కీలకం
ఎన్నికల సమయంలో ఎలక్షనీరింగ్ అనేది చాలా కీలకం. తెలంగాణలో జరిగిన విధంగా ఎన్నికలు సున్నితంగా ఆంధ్రాలో జరగాలని ఆశిద్దాం. అలాగే అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ మాత్రం బరి తెగించినా నిలువరించడానికి, చట్టాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉండాలి. క్రియాశీల వాలంటీర్లు, కార్యకర్తలతో విడతల వారీగా అన్నీ నియోజకవర్గాల్లో సమావేశాలు జరగాలి. వారు ఈ కీలక సమయాల్లో ఎలాంటి విధులు నిర్వర్తించాలి..? వారి సేవలను ఎలా వినియోగించుకోవాలో నియోజకవర్గ నాయకులు దిశానిర్దేశం చేయాలి. తెనాలి నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమం మొదలుపెడుతున్నాం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ప్రత్యేక డ్రైవ్ జరగాలి. పార్టీకి కొండంత అండగా నిలిచిన క్రియాశీలక వాలంటీర్లు, కార్యకర్తల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే ప్రణాళికను రూపొందించుకోవాలి’’ అన్నారు. ఈ సందర్భంగా క్రియాశీలక వాలంటీర్ల సందేహాలను మనోహర్ నివృత్తి చేశారు. ఎన్నికల వేళ ఎలా సన్నద్ధం కావాలో వారి సూచనలను విన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ బేగ్, మాజీ కౌన్సిలర్ హరిదాసు గౌరీశంకర్, తెనాలి మండలాధ్యక్షులు దివ్వెల మధుబాబు, కొల్లిపర మండలాధ్యక్షుడు వెంకయ్యనాయుడు తదితరులు ఉన్నారు.