బెంగాల్‌లో ప్రారంభమైన నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

8 దశల ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ఈ ఉదయం నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 44 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండగా, మొత్తం 373 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1.15 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇటీవల జరిగిన మూడు విడతల్లోనూ పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈసారి మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బలగాలను భారీగా మోహరించారు. మొత్తం 80 వేల కేంద్ర బలగాలను ఎన్నికల అధికారులు రంగంలోకి దించారు.

టోలీగంజ్ నుంచి బరిలోకి దిగిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో భవితవ్యం కూడా ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. అలాగే, బెహెలా నుంచి టీఎంసీ కీలక నేత అయిన మంత్రి పార్థ చటర్జీ బరిలో ఉండగా, ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి ప్రముఖ నటి పాయల్ సర్కార్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ 44 నియోజకవర్గాల్లో 39 స్థానాలను టీఎంసీ సొంతం చేసుకుంది.