ఢిల్లీ నుంచి తన స్వస్థలం కాన్పూర్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రైలు ప్రయాణం

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ రైలులో కుటుంబ సమేతంగా ప్రయాణిస్తున్నారు. ఢిల్లీ నుంచి తన స్వస్థలం కాన్పూర్ కు  రైలులో పయనమయ్యారు. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ఓ ప్రత్యేకరైలులో సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ తరలి వెళ్లారు.

రాష్ట్రపతి రైలు ప్రయాణం సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్, జాతీయ రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సునీత్ శర్మ స్వయంగా విచ్చేసి వీడ్కోలు పలికారు. వారు ఆయనకు మహాత్ముడి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించారు. రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించాక, రామ్ నాథ్ కోవింద్ స్వస్థలానికి వెళ్లడం ఇదే ప్రథమం అని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

కాగా, రాష్ట్రపతి దంపతులు ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు కాన్పూర్ సమీపంలోని జింఝూక్, రూరా ప్రాంతాల్లో ఆగనుంది. అక్కడ కోవింద్ తన పాఠశాల విద్యాభ్యాసం రోజుల్లో పరిచయం ఉన్న వ్యక్తులతో ముచ్చటిస్తారు. అనంతరం స్వస్థలానికి పయనమవుతారు.