తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్

భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్‌ చేసి వర్షాలు, అనంతర పరిస్థితులను అడిగితెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే మరిన్ని సహాయక చర్యలు చేపట్టాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ సూచించారు. రెస్క్యూ & రిలీఫ్ వర్క్ లో కేంద్రం నుండి సాధ్యమయ్యే అన్నివిధాల మద్దతు ఉంటుందన్న ప్రధాని.. అవసరమైన సహాయానికి హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు.

వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం.. ఇరు రాష్ట్రాల సాయానికి ముందుకు వచ్చింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఏపీలో వర్షాలు, అనంతర పరిస్థితులను సీఎం వైఎస్ జగన్ ను అడిగితెలుసుకున్నారు. రాష్ట్రంలో వర్షప్రభావిత ప్రాంతాలు, నెలకొన్న పరిస్థితులను సీఎం ప్రధానికి వివరించారు. వాయుగుండం తీరందాటిందని, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించారు. అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు.