అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ..

మూడు రోజుల పర్యటన నిమిత్తం నిన్న బయలుదేరిన భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. త్రివర్ణ పతాకాలు చేబూనిన ఎన్నారైలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా ఐక్యరాజ్య సమితి సమావేశం, క్వాడ్ సదస్సులో పాల్గొంటారు.

అలాగే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌తోనూ సమావేశమవుతారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. ఇంకా, ఉగ్రవాద నిర్మూలన, ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రస్తుత పరిణామాలు, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపైనా చర్చిస్తారు. పర్యటన ముగించుకుని ఈ నెల 26న తిరిగి స్వదేశానికి వస్తారు.