నేడు, రేపు ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె… దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు బంద్!

దేశవ్యాప్తంగా నేడు, రేపు బ్యాంకుల సమ్మె జరగనుంది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మె కారణంగా రెండ్రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ సమ్మెలో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు పాల్గొంటారని అంచనా.

అయితే, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ వంటి ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథాతథంగా పనిచేస్తాయి. సమ్మె ప్రభావం ప్రైవేటు బ్యాంకులపై లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 9 ఉద్యోగ సంఘాల వేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇప్పటికే కేంద్రం ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించగా, మరో రెండు బ్యాంకులను కూడా ఇదే బాటలో ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైంది.