పుంగనూరు దాడి… వై.సి.పి. సర్కారు దుర్నీతి

ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తాం.. ఎదిరించి నిలబడితే ఆస్తులను ధ్వంసం చేస్తాం… మానప్రాణాలను తోడేస్తామన్న రీతిలో ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ కేంద్రంలోని వెనుకబడిన వర్గానికి చెందిన శ్రీ రామచంద్ర యాదవ్ ఇంటిపై జరిగిన భీభత్సకాండ – వై.సి.పి. సర్కారు ఆలోచన విధానాన్ని.. దుర్నీతినీ ప్రపంచానికి మరోమారు వెల్లడి చేస్తోంది. మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రైతు సభను నిర్వహించాలనుకోవడమే శ్రీ రామచంద్ర యాదవ్ చేసిన నేరమా? ప్రతిపక్ష పార్టీలు సభలు సమావేశాలు పెట్టుకోవడం ఈ ప్రాంతంలో నిషిద్దమా? రైతు సభకు అనుమతి లేదన్న అధికారులు శ్రీ రామచంద్ర యాదవ్ ఇంటిపై వైసీపీ కిరాయి మూకలు దాడులు చేస్తుంటే సకాలంలో ఎందుకు ఆపలేకపోయారు? ఇది ముమ్మాటికీ అధికార పక్షం చేస్తున్న వికృత రాజకీయంలో భాగమే. గత ఎన్నికలలో జనసేన పార్టీ నుంచి పుంగనూరులో పోటీ చేసిన శ్రీ రామచంద్ర యాదవ్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా గర్హిస్తున్నాం. ప్రశ్నించేవారు, తమకు వ్యతిరేకంగా బలంగా పోటీ చేసేవారు లేకుండా చేసుకునే కుట్రలో భాగంగా అక్కడి పరిస్థితులను బట్టి అవగతమవుతోంది. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రంపై జరిగిన దాడిగా జనసేన పార్టీ భావిస్తోంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజాస్వామికవాదులంతా ఈ దాడిని ఖండించాలని కోరుతున్నాము.